Sat. Jul 27th, 2024

365తెలుగు డాట్ కాం ఆన్ లైన్ న్యూస్, జులై 21, హైదరాబాద్: జగిత్యాల జిల్లా వెల్గటూరుకు చెందిన పానుగోటి శ్రీనివాసరావు హైదరాబాద్‌లో ఫామ్‌హౌజ్‌లో విదేశీ పక్షులను పోషిస్తున్నారు. రంగురంగుల పక్షులు సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. వాటితోపాటు అంతరించిపోతున్న అరుదైన జాతి ఆవులను సంరక్షిస్తున్నారు. మూగ జీవులు పంచే ప్రేమ ఎంతో విలువైనదని, వాటితో గడపడం వల్ల మానసికంగా ఎంతో ఉల్లాసంగా ఉండగలుగుతున్నామంటున్నారు పానుగోటి శ్రీనివాసరావు. సామాజిక సేవలోనూ ముందుంటూ… అన్ని వర్గాలవారికి తనవంతు సాయమందిస్తూ…ఆత్మ బంధువవుతున్నారు ఆయన….

పక్షులతోపాటు ఆవులను సంరక్షిస్తున్నారు

పక్షులతోపాటు శ్రీనివాసరావు అరుదైన ఆవులను కూడా సంరక్షిస్తున్నారు. వీటిలో పుంగనూరు, సాహివాల్‌, గిర్‌, నగోరి, కాంక్రెజ్‌, కపిల వంటి అరుదైన ఆవు జాతులున్నాయి.‘క్షీర ధార’ పేరుతో డైరీ ఉత్పత్తులను అందిస్తున్నారు. వాటిని సాంప్రదాయ పద్దతిలోనే రూపొందిస్తున్నారు. అరుదైన జాతి ఆవులను సంరక్షించినందుకు శ్రీనివాసరావుకు బయోడైవర్సిటీ అవార్డు, పాడి రైతు అవార్డులు వచ్చాయి.

ఫారెన్‌ బర్డ్స్‌తో ‘మినీ జూ’ ఏర్పాటు చేశారు….

చిన్నప్పటి నుంచి పానుగోటి శ్రీనివాసరావుకు పశువులన్నా, పక్షులన్నా ఎంతో ఇష్టం. 2007లో ఓ వ్యక్తి శ్రీనివాసరావు దగ్గరకు మలుకాన్‌ అనే విదేశీ పక్షిని తీసుకువచ్చాడు. దానిని చూడగానే ఆయన ముచ్చట పడి రూ.1,50,000 లకు కొనుగోలు చేశారు. కొన్నాళ్లకు దానికి తోడుగా మరో జంట పక్షిని తీసుకువచ్చారు. అలా ఒక్కో పక్షి జాతిలో ఆడ, మగ పక్షులను పెంచడం ప్రారంభించారు. మొదట్లో అవి మన వాతావరణాన్ని తట్టుకోలేక ఇబ్బంది పడ్డాయి. శ్రీనివాసరావు ఆయా పక్షులు పెరిగేందుకు అనువైన వాతావరణాన్ని ఏర్పరుస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ నగరంలో 200లకు పైగా ఫారెన్‌ బర్డ్స్‌తో ‘మినీ జూ’ ఏర్పాటు చేశారు.

కిలకిలరావాలతో …
ఫామ్‌హౌజ్‌ సందడిగా కనిపిస్తుంటుంది
రంరరంగుల పక్షుల కిలకిలరావాలతో ప్రతి రోజూ శ్రీనివాసరావు ఫామ్‌హౌజ్‌ సందడిగా కనిపిస్తుంటుంది. మండేరిన్‌ డక్స్‌, కరోలినా డక్స్‌, మకావ్‌ వంటి పక్షి జాతులున్నాయి. మన దేశానికి చెందిన పక్షులను పంజరంలో పెట్టకూడదనే నిబంధన ఉన్నది. విదేశీ పక్షులకు అటువంటిదేమీ లేదు. ఇక్కడి వాతావరణాన్ని తట్టుకోగలిగే వాటినే ఎంపిక చేసుకుని తీసుకువస్తారు. అలాంటి బర్డ్స్‌నే ఇక్కడ పెంచుతుంటారు.

కన్నబిడ్డలా సాకుతారు..

ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే గానీ పక్షుల పెంపకం సాధ్యం కాదు. వీటిని రాత్రింబవళ్లు చూసుకోవడానికి నలుగురు వ్యక్తులున్నారు. పక్షులకు అనువైన వాతావరణాన్ని అందించడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వాటి కోసం రెల్లుగడ్డి పాకలు నిర్మించారు. దీని వల్ల ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుతాయి. శ్రీనివాసరావు దంపతులిద్దరూ ఉదయం, సాయంత్రం పక్షుల ఆలనా పాలనా దగ్గరుండి మరీ చూసుకుంటారు. పక్షుల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా వైద్యుణ్ణి నియమించారు. ఎప్పటికప్పుడు గమనిస్తూ, అవి నివసించే గదుల్లోకి పాములు, ఎలుకలు చేరకుండా పరిశుభ్రంగా ఉంచుతారు. వాటికి ప్రత్యేకంగా ఓ ఫుడ్‌ మెనూ ఉన్నది. ఉదయం ఉడికించిన ధాన్యాలు, మధ్యాహ్నం పండ్లు, కూరగాయ ముక్కలు, సాయంత్రం ఆయిల్‌తో చేసిన ఆహారం అందిస్తుంటారు. కన్నబిడ్డలా సాకుతారు.. వాటి జీవిత కాలం? అవి ఏ కాలంలో పిల్లలను పొదుగుతాయి? ఇటువంటి సమాచారాన్ని సేకరించి వాటిని మాత్రమే పెంచుతుంటారు. వాటి పోషణ విషయంలో ఏదైనా సందేహం వస్తే విదేశాల్లో ఉన్న పెంపకందారులను అడిగి తెలుసుకుంటారు. హైదరాబాద్‌లోని జెన్‌టెక్‌లో వాటికి పరీక్షలు చేయించి అవి ఆడ,మగ అని నిర్ధారణ అయిన తర్వాత జంట పక్షిని తెప్పిస్తుంటారు. మన దేశంలో పక్షుల వలే ఇవి కూడా గుడ్లు పెట్టి పొదిగి పిల్లలను చేస్తాయి.