365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,తిరుమల ,13 జూన్ 2021: జమ్మూ సమీపంలోని మజీన్ గ్రామంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణానికి ఆదివారం వైభవంగా శంఖుస్థాపన నిర్వహించారు.యాగశాలలో అర్చకులు, వేద పండితులు గణపతి పూజ, విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అగ్ని ప్రతిష్ట, వాస్తుహోమం జరిపారు. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి యాగశాలలోని కలశ జలాలను శంఖు స్థాపన ప్రాంతానికి తీసుకుని వచ్చి శిలను అభిషేకించారు.


అనంతరం అర్చకులు అక్కడ శిలాన్యాస పూజ నిర్వహించారు. ఈ సందర్బంగా నవరత్నాలను వాటి స్థలంలో ఉంచి వాటి మీద శిలను ఉంచి చతుర్వేదాలను, అష్ఠదిక్పాలకులను ఆవాహనం చేశారు. పంచగవ్యాలతో శిలను అభిషేకించారు. అనంతరం మహావిష్ణువును ఆరాధించి శిలను భూమిలో ప్రతిష్టించి పూజలు నిర్వహించారు.


జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, టీటీడీ చైర్మన్, వైవి సుబ్బారెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, డాక్టర్ జితేంద్ర సింగ్, ఎంపి జగల్ కిషోర్ శర్మ, టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, రామ్ మాధవ్, టీటీడీ పాలకమండలి సభ్యులు గోవింద హరి స్థానిక అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


భూమి పూజ అనంతరం లెఫ్టినెంట్ గవర్నర్, కేంద్ర మంత్రులు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణం నమూనాలను చూసి వివరాలు తెలుసుకున్నారు. తరువాత శ్రీవారి ఆలయ నిర్మాణానికి సంబంధించిన శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు.


