365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఎన్టీఆర్ జిల్లా, నందిగామ, మే 1,2025 : నందిగామ నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి నాబార్డు నిధుల కింద భారీగా నిధులు మంజూర య్యాయని ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గురువారం తెలిపారు.

అనాసాగరం నుండి హనుమంతుపాలెం రోడ్డుకు రూ.1.48 కోట్లు, వీరులపాడు మండలం జయంతి నుంచి ఎర్రుపాలెం రోడ్డుకు రూ.1.75 కోట్లు మంజూరయ్యాయని ఆమె ఓ ప్రకటన ద్వారా తెలిపారు.

కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా వేగంగా అభివృద్ధి పనులు చేపడుతోందని ఎమ్మెల్యే సౌమ్య పేర్కొన్నారు.

గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జయంతి నుంచి ఎర్రుపాలెం రోడ్డు పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి నప్పటికీ, 2019లో వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నిధులు వృథా అయ్యాయని ఆమె ఆరోపించారు.

మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు హయాంలో “గడపగడపకు ప్రభుత్వం” కార్యక్రమంలో ఎర్రుపాలెం రోడ్డు గురించి గ్రామస్తులు ప్రశ్నించగా, వైకాపా నాయకులు వారిపై దాడికి దిగి పోలీసులతో బెదిరించారని ఆమె విమర్శించారు.

ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే రూ.1.75 కోట్ల నిధులు మంజూరు చేయించామని ఆమె తెలిపారు.

అనాసాగరం నుంచి హనుమంతుపాలెం రోడ్డుకు కూడా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు చేయగా, వైకాపా ప్రభుత్వం ఆ నిధులను వెనక్కి పంపిందని ఎమ్మెల్యే సౌమ్య ఆరోపించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ రోడ్డు నిర్మాణానికి తిరిగి నిధులు మంజూరు చేయించిందని ఆమె తెలిపారు.

ఇది కూడా చదవండి…తెలుగు పండుగల పేర్లతో వచ్చిన సినిమాలు..

ఇది కూడా చదవండి…ఈ సంవత్సరం EPFO రూల్స్ లలో ఐదు కీలక మార్పులు..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే సౌమ్య అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధిని చేసి చూపిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం పది నెలల్లోనే నందిగామ అభివృద్ధిని అగ్రపథాన నడిపిస్తోందని ఆమె పేర్కొన్నారు.