Mon. Jul 8th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూన్ 23,2024 : తెలంగాణలో తొలి అన్న క్యాంటీన్ హైదరాబాద్లో ప్రారంభమైంది. సీబీఎన్ ఫోరం వ్యవస్థాపకుడు జెనెక్స్ అమర్ ఈ క్యాంటీన్ ను ప్రారంభించారు. పేద వారికి కనీసం ఒక్క పూటైనా కడుపునిండా తిండి పెట్టాలనే ఉద్దేశంతో ఈ క్యాంటీన్ ను ప్రారంభించినట్లు అమర్ వివరించారు.

ఐదు రూపాయలకే కడుపు నిండా తినే అవకాశం ఈ క్యాంటీన్ ద్వారా కలుగుతుందని చెప్పారు. ఇక్కడ భోజనం చేసే వారి ఆశీస్సులతో చంద్రబాబు నిండునూరేళ్లు ఆరోగ్యంగా ఉంటారని, ఉండాలని కోరుకుంటున్నట్లు అమర్ తెలిపారు.

పేదోళ్ల ఆశీస్సులు, భగవంతుడి ఆశీర్వాదంతో చంద్రబాబు మరింత ఆరోగ్యంగా ప్రజా సేవలో నిమగ్నం కావాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ఈ అన్న క్యాంటీన్ ద్వారా రోజుకు 500 మంది పేద వారి ఆకలి తీర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

హైదారాబాద్ లోని మాదాపూర్ లో 100 ఫీట్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఈ అన్న క్యాంటీన్ విషయం చంద్రబాబు దృష్టికి ఇంకా తీసుకెళ్లలేదని అమర్ చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బిజీగా ఉంటారని, ఆయనకు వీలు చిక్కినపుడు కలిసి మాట్లాడుతామని వివరించారు.

క్యాంటీన్ ను ప్రస్తుతం తాను ఒక్కడినే ప్రారంభించినా.. స్నేహితులు, దాతల సహకారంతో సిటీ అంతటా ఇలాంటి క్యాంటీన్లను విస్తరించే ఆలోచన ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లు ఎందరో పేదల ఆకలి తీర్చి వారి ఆదరణ పొందాయని అమర్ అన్నారు. చంద్రబాబు స్ఫూర్తితో తెలంగాణలో సైతం అన్న క్యాంటీన్‌ ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు.