365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అక్టోబర్ 25,2024 :హైదరాబాద్ నగరంలోని వరద సమస్యలపై దృష్టి సారించారు హైడ్రా కమిషనర్ ఏ.వీ.రంగనాథ్. అందులో భాగంగా లక్డీకాపూల్ ప్రాంతంలో వరద ముప్పు నివారణకు అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. శుక్రవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, ట్రాఫిక్ అదనపు కమిషనర్ పి.విశ్వప్రసాద్ కలిసి లక్డీకాపూల్ ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా హైడ్రా, ట్రాఫిక్, జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులు పాల్గొన్నారు.
జలమండలి ఎయిర్టెక్ మెషిన్ ఉపయోగం..
టెలిఫోన్ భవన్ ప్రాంతం నుంచి మెహిదీపట్నం దారిలోని మ్యాన్హోళ్లను పరిశీలిస్తూ, జలమండలి ప్రత్యేక యంత్రాలను వినియోగించారు.
స్ట్రాంవాటర్ పైపులైన్ల పరిశీలన..

దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన పైపులైన్లు పూర్తిగా శిథిలమైపోయి వరదనీటి ప్రవాహాన్ని సరిగా మళ్లించలేకపోతున్నాయని అధికారులు గుర్తించారు. మెట్రో పిల్లర్ 1211 వద్ద, మెహిదీపట్నం వైపు వంతెన ముందు భాగంలో ఉన్న పైపులైన్లు పూర్తిగా శిథిలమయ్యి నీటి ప్రవాహం బ్లాక్ అవుతోంది.
కొత్త పైపులైన్ల ఏర్పాటుపై చర్చలు..
శిథిలమైన పైపులైన్ల స్థానంలో కొత్త పైపులైన్లు నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ అధికారులతో చర్చించి, అవసరమైన ఏర్పాట్లకు ఏవీ రంగనాథ్ ప్రణాళికలు రూపొందించారు.
యుద్ధ ప్రాతిపదికన చర్యలు..
వారం రోజుల్లో పైపులైన్ల నిర్మాణం ప్రారంభించి, ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా త్వరగా పనులను పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. నగరంలో వరద ముప్పు ఎక్కువగా ఉన్న 30 ప్రాంతాలను పరిశీలించి, వచ్చే వర్షాకాలానికి వరద సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
స్థానికుల స్పందన..
గత మంగళవారం ఈ ప్రాంతంలో పరిశీలన జరిపి, శుక్రవారం వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టిన అధికారులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. “20 ఏళ్లుగా ఉన్న వరద సమస్యకు పరిష్కారం కనుగొనే దిశగా జరుగుతున్న ఈ చర్యలకు మా మద్దతు ఉంటుందని స్థానిక వ్యాపారులు తెలిపారు.

లక్డీకాపూల్ చౌరస్తాలోని పైపులైన్లు శిథిలమవడంతో వర్షాకాలంలో వరద నీరు నిలిచి, దుకాణాల్లోకి చేరుతుందని వ్యాపారులు గోడు పెట్టుకున్నారు. ఎట్టకేలకు ఈ సమస్యను పరిష్కరించేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలను స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.