365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, డిసెంబర్ 9, 2024: గ్రీన్పీస్ ఇండియా తాజా నివేదిక, “ఉత్తర భారతం మాత్రమే కాదు: దేశంలోని ప్రధాన నగరాల్లోనూ ఎన్ఓ2 కాలుష్యం, ఆరోగ్య ముప్పు” అనే నివేదిక ప్రకారం, హైదరాబాద్ నగరంలో కూడా నైట్రోజన్ డయాక్సైడ్ (ఎన్ఓ2) కాలుష్యం ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది.
నైట్రోజన్ డయాక్సైడ్ అనేది కంటికి కనపడని విషపూరిత వాయువు. ట్రాఫిక్, ఇంధనాలు మండించడం వల్ల ఇది వస్తుంది. పట్టణప్రాంతాల్లో ఇది సాధారణం. వాహనాల నుంచి, శిలాజ ఇంధనాలు మండించడం వల్ల ఎన్ఓ2 ప్రధానంగా వస్తుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గాలిలో ఎన్ఓ2 వార్షిక సగటు సాంద్రత క్యూబిక్ మీటరుకు పది మైక్రోగ్రాములు మించరాదని సిఫార్సు చేస్తుంది, అయితే ఎన్ఏఏక్యూఎస్ మాత్రం 40 మైక్రోగ్రాములు ఉండొచ్చని చెబుతోంది.
హైదరాబాద్లో 2023 సంవత్సర వార్షిక సగటు ఎన్ఓ 2 సాంద్రత 14 సీఏఏక్యూఎం (కామన్ యాంబియెంట్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్ల)లో 9 చోట్ల డబ్ల్యుహెచ్ఓ ప్రమాణాలను అధిగమించింది. ఎన్ఓ2 సాంద్రత అత్యధికంగా ఉన్న స్టేషన్.. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. కాస్త తక్కువగా ఉండే భారత జాతీయ ప్రమాణాలను సైతం ఇది అధిగమించింది.
2023లో హైదరాబాద్ లోని అన్ని సీఏఏక్యూఎం మానిటర్ల వార్షిక సగటు ఎన్ఓఈ సాంద్రతలు. రోడ్డు పక్కన వర్గీకరించిన మానిటరింగ్ స్టేషన్లు ముదురు నీలం రంగులో చూపించారు.
ఉబ్బసం, వాయుమార్గ మంట, శ్వాసకోశ చికాకు, ఇప్పటికే ఉన్న శ్వాసకోశ వ్యాధులు తీవ్రతరం కావడం లాంటి ప్రతికూల ఆరోగ్య ప్రభావాలకు ఎన్ఓ2 కారణం అవుతుందని శాస్త్రీయ ఆధారాలు చెబుతున్నాయి. ఇది ఊపిరితిత్తుల పనితీరును దెబ్బతీస్తుంది, ఎలర్జీలను తీవ్రతరం చేస్తుంది.
ప్రసరణ వ్యాధులు, ఇష్కెమిక్ గుండె జబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధులతో మరణానికి అవకాశం పెరుగుతుంది. 2015 లో హైదరాబాద్లో 2,430 పీడియాట్రిక్ ఆస్తమా కేసులు రావడానికి ఎన్ఓ 2 కాలుష్యం కారణమని తేలింది. ఎన్ఓ2 వల్ల కలిగే ప్రమాదాలను ఇది సూచిస్తుంది.
ఈ నివేదిక ఒక కీలకమైన వాస్తవాన్ని నొక్కి చెబుతుంది: వాయు కాలుష్యం ఢిల్లీ లేదా ఉత్తర భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు. భారతదేశంలోని చాలా నగరాలలో అధిక ఎన్ఓ2 స్థాయిలకు రవాణా రంగం ఎక్కువగా దోహదం చేస్తుంది. నగరాలు పెరుగుతున్నకొద్దీ ప్రైవేటు వాహనాల పెరుగుదల గాలి నాణ్యతను మరింత దిగజార్చి ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
ఈ సమస్యను పరిష్కరించడానికి, సుస్థిరమైన, సమర్థవంతమైన ప్రజారవాణా వ్యవస్థ దిశగా మనకు ప్రాథమిక మార్పు అవసరం. పరిశుభ్రమైన, మరింత అందుబాటులో ఉన్న రవాణా సాధనాల్లో పెట్టుబడి పెట్టడం కేవలం పర్యావరణ అవసరం మాత్రమే కాదు- ఇది ప్రజారోగ్యపరంగా కూడా అత్యవసరం. ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్ధారించడానికి క్లీన్ మొబిలిటీ పరిష్కారాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలి.
వాయు కాలుష్యానికి, ముఖ్యంగా ఎన్ఓ2 కాలుష్యానికి మన దేశ స్పందన.. ప్రపంచ ఆరోగ్య ప్రమాణాల కంటే తక్కువగా ఉంది. దేశంలోని నేషనల్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ (ఎన్ఎఎక్యూఎస్) డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాల కంటే చాలా తక్కువ కఠినమైనవి.
వీటిని 15 సంవత్సరాలుగా మార్చలేదు. ఈ కాలం చెల్లిన విధానం ప్రజారోగ్యాన్ని తగినంతగా రక్షించడంలో విఫలమైంది. కొన్ని కోట్ల మంది తీవ్రమైన వాయు కాలుష్య ప్రభావాలకు గురవుతారు.
“వాయుకాలుష్యం భారతదేశంలో పెరుగుతున్న ప్రజారోగ్య ముప్పు, దీనికి సాహసోపేతమైన, సృజనాత్మక పరిష్కారాలు అవసరం. ప్రజారవాణా కోసం చౌకైన ‘క్లీన్ ఎయిర్ కన్సెషన్’ అటువంటి పరిష్కారాలలో ఒకటి. సామూహిక రవాణాను మరింత అందుబాటులోకి తీసుకురావడం ద్వారా, ఈ విధానం ప్రజలు తమ కార్లను విడిచిపెట్టేలా ప్రోత్సహిస్తుంది.
రద్దీని, హానికరమైన ఉద్గారాలను తగ్గిస్తుంది. ఇలాంటి చర్యలు వాయునాణ్యత, ప్రజారోగ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తాయి. మరింత ఆరోగ్యకరమైన నగరాలను సృష్టించగలవు” అని గ్రీన్ పీస్ ఇండియా మొబిలిటీ క్యాంపెయినర్ ఆకిజ్ ఫరూక్ అన్నారు.
భారతీయ నగరాల్లో వాయునాణ్యత తీవ్రమైన ప్రజారోగ్య సమస్య. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై, కోల్కతా, పూణే లాంటి నగరాల్లో సంక్షోభాన్ని పరిష్కరించడానికి, గ్రీన్పీస్ ఇండియా ప్రాంతాలవారీగా నిర్దిష్ట విధానాన్ని సిఫార్సు చేస్తుంది.
ఎన్ఏఏక్యూఎస్ను అప్ డేట్ చేయడంతో పాటు, వాయు కాలుష్య సంబంధిత పరిస్థితులను నిర్ధారించడానికి ప్రాథమిక ఆరోగ్య సేవలను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలి.
పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, బయట పని చేసే కార్మికులు, అప్పటికే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు… ఇవంటి బలహీన సమూహాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో సమగ్ర ఆరోగ్య సలహా వ్యవస్థ, ప్రజలకు అవగాహన, అధిక కాలుష్య సమయంలో సకాలంలో హెచ్చరికలు అవసరం.
మహిళలకు ఉచిత ప్రయాణాల్లాంటి ప్రజా రవాణాను పెంచడం ద్వారా స్థానిక ప్రభుత్వాలు వాహన ఉద్గారాలను తగ్గించే ప్రయత్నం చేయాలి. పురోగతిని అంచనా వేయడానికి, సమర్థవంతమైన జోక్యాలకు మార్గనిర్దేశం చేయడానికి తక్కువ ఖర్చుతో కూడిన సెన్సార్లు, ఇప్పటికే ఉన్న వ్యవస్థలు, ఉపగ్రహ డేటాను ఏకీకృతం చేసే ‘హైబ్రిడ్’ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ నెట్వర్క్ లలో పెట్టుబడులు పెరగాలి.
ప్రధానాంశాలు:
- హైదరాబాద్లో ఏర్పాటుచేసిన 14 వాయునాణ్యత మానిటరింగ్ స్టేషన్లలో 9చోట్ల డబ్ల్యుహెచ్ఓ ప్రమాణాల కంటే కాలుష్యం ఎక్కువగా ఉంది
- ఎన్ఓ2 సాంద్రత అత్యధికంగా ఉన్న స్టేషన్.. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. కాస్త తక్కువగా ఉండే భారత జాతీయ ప్రమాణాలను సైతం ఇది అధిగమించింది.
- 2015 లో హైదరాబాద్లో 2,430 పీడియాట్రిక్ ఆస్తమా కేసులు రావడానికి ఎన్ఓ 2 కాలుష్యం కారణమని పరిశోధకులు తేల్చారు.
- రోడ్డు రవాణా ఎన్ఓ2 ఉద్గారాలకు రెండో అతిపెద్ద కారణం. 24% ఉద్గారాలు వీటినుంచే వస్తున్నాయి.
- ప్రాంతాలవారీ విధానాలు ఉండాలని గ్రీన్పీస్ ఇండియా సూచిస్తోంది. ఎన్ఏఏక్యూఎస్ను అప్డేట్ చేయడంతోపాటు, వాయుకాలుష్య సంబంధిత సమస్యలను గుర్తించేందుకు ప్రాథమిక ఆరోగ్యసేవలను బలోపేతం చేయడంపై దృష్టి సారించాలి.