365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మే 1, 2025 : ప్రముఖ లోహియా గ్రూప్ తెలంగాణ రాష్ట్రంలోకి తమ కార్యకలాపాలను విస్తరించింది. మేడ్చల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రపంచ స్థాయి బిస్కెట్ తయారీ కేంద్రాన్ని గురువారం ప్రారంభించింది.
మనీషా లోహియా లహోటి నేతృత్వంలోని లోహియా కన్ఫెక్షనరీ ఈ యూనిట్ రుచి, పరిశుభ్రత, ఆటోమేషన్, నాణ్యతలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తుందని సంస్థ తెలిపింది.
ఏడు ఎకరాల్లో రూ. 300 కోట్ల పెట్టుబడితో నెలకొల్పిన ఈ హై-స్పీడ్ ఆటోమేటెడ్ ప్లాంట్ ప్రారంభ దశలో నెలకు 1,000 టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీనిని భవిష్యత్తులో 5,000 టన్నులకు పెంచే అవకాశం ఉంది.
ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 2,000 మందికి, పరోక్షంగా మరో 4,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయని అంచనా.

ఈ సందర్భంగా లోహియా కన్ఫెక్షనరీ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మనీషా లోహియా లహోటి మాట్లాడుతూ, తమ బిస్కెట్లు అత్యుత్తమ నాణ్యమైన పదార్థాలతో, అధునాతన సాంకేతికతతో తయారు చేస్తున్నామని తెలిపారు. జుబిలో, మోయి మోయి బ్రాండ్ల కింద వివిధ రకాల బిస్కెట్లను ఉత్పత్తి చేయనున్నట్లు ఆమె వెల్లడించారు.
లోహియా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ మహావీర్ లోహియా మాట్లాడుతూ, ఇది కేవలం తయారీ యూనిట్ మాత్రమే కాదని, సమాజ అభివృద్ధికి తోడ్పడే ఒక ప్రయత్నమని అన్నారు.
ఇది కూడా చదవండి…ఈ సంవత్సరం EPFO రూల్స్ లలో ఐదు కీలక మార్పులు..
ఇది కూడా చదవండి…గోల్డ్ లోన్స్ తీసుకునే ముందు జాగ్రత్తలు..
పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, దాదాపు సున్నా వ్యర్థాల విధానంతో ఈ యూనిట్ను నడుపుతామని ఆయన తెలిపారు. ఈ యూనిట్లో 40% కంటే ఎక్కువ మంది మహిళా ఉద్యోగులు ఉండటం విశేషం.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ అత్యాధునిక బిస్కెట్ తయారీ యూనిట్ తెలంగాణలో ఆహార తయారీ రంగానికి ఒక మైలురాయిగా నిలుస్తుందని భావిస్తున్నారు.