Sat. Jul 27th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఏప్రిల్ 30,2023: ప్రపంచ పాత్రికేయ దినోత్సవం సందర్భంగా సమాచారభారతి ఆధ్వర్యంలో జర్నలిస్టులను ఘనంగా సన్మానించారు. “తొలి ఆదర్శనీయ పాత్రికేయుడు” నారద మహర్షి జయంతిని ప్రపంచ పాత్రికేయ దినోత్సవం గా భావిస్తారు. రెడ్ హిల్స్ లోని FTCCI ఆడిటోరియంలో నారద మహర్షి జయంతివేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులను సత్కారించారు.

జర్నలిస్టులకు సత్కారం..

“వడ్లమూడి స్మారక పురస్కారం” సీనియర్ పాత్రికేయులు రమా విశ్వనాథ్ కు, భండారు సదాశివ రావు స్మారక’ పురస్కారం సీనియర్ పాత్రికేయులు సామవేదం జానకీరామశర్మకు, ‘ సమాచారభారతి కాలమిస్ట్’ పురస్కారం కాలమిస్ట్ శ్యామసుందర్ వరయోగికి, ‘సమాచారభారతి యువపురస్కారం’ యువ పాత్రికేయులు కొంటు మల్లేశంకు ప్రదానం చేసారు.

ఈ కార్యక్రమానికి యాంకర్ గా మహతి వ్యవహరించారు. సమాచారభారతి సభ్యులు వేదుల నరసింహం, రాంపల్లి మల్లికార్జున, దుర్గారెడ్డి, రాజగోపాల్,సమాచారభారతి కార్యదర్శి ఆయుష్ నడింపల్లి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

సమాచార భారతి అధ్యక్షులు డా. జి గోపాలరెడ్డి సమాచారభారతి ప్రాముఖ్యాన్ని గురించి వివరించారు. యువ పాత్రికేయులకు విలువలతో కూడిన పాత్రికేయత పై తర్ఫీదు ఇవ్వటం, సామాజిక మాధ్యమంలో పనిచేస్తున్న పౌర పాత్రికేయుల సదస్సులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు సమాచారభారతి నిర్వహిస్తున్నదని ఆయన తెలిపారు.

నారద మహర్షి వైశాఖ బహుళ పాడ్యమి రోజున జన్మించారని, మానవజాతికి ఉపయొగపడే జ్ఞానం అందించే సారధిగా నారద మహర్షి పనిచేశారని క్రాంతి దేవ మిత్ర తెలిపారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జాతీయ పత్రిక ‘ఆర్గనైజర్’ సంపాదకులు ప్రఫుల్ల కేత్కర్ మాట్లాడుతూ నారద మహర్షి ని గురించిన అపప్రథ ప్రచారం చేయడంతో వారి లోకకళ్యాణ దృష్టిని గమనించక పోవడం జరిగిందీ అన్నారు.

30 మే 1826 వ సంవత్సరం కలకత్తా లో ప్రారంభమైన ఉద్దండ్ మార్తాండ్ పత్రిక ‘నారద మహర్షి’ ముఖచిత్రంతో ప్రచురితం అయ్యిందనీ, ఆ తర్వాత అనేక పర్యాయాలు నారద మహర్షిని పత్రికా రంగ ఆద్యుని గా గుర్తించినా, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆయన గురించి ఎక్కడా ప్రచారం లేకుండా చేశారని వాపోయారు.

పాత్రికేయులు నారద సూత్రాలలోని 75,76,77 వ సూత్రాలను ఆదర్శంగా తీసుకొని సరైన ప్రశ్నలు అడగటం, సరైన వ్యక్తి ని అడగటం, సరైన సమయంలో వార్తను ఇవ్వటం ఆదర్శంగా తీసుకోవాలని ఆయన హితవు పలికారు.