365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ ,తిరుపతి,జూన్ 28,2021: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజ స్వామివారి అవతారోత్సవాలు జూన్ 29 నుండి జూలై 1వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరుగనున్నాయి. కోవిడ్ – 19 వ్యాప్తి నేపథ్యంలో ఈ ఉత్సవాలను ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగా నిర్వహిస్తారు.
ఈ మూడు రోజుల పాటు మధ్యాహ్నం 2.30 నుండి 4 గంటల వరకు శ్రీ కృష్ణస్వామి ముఖమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామివారికి తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఉత్సవర్లకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం చేస్తారు. అనంతరం సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు శ్రీ సుందరరాజస్వామివారికి ఊంజల్ సేవ నిర్వహిస్తారు.
సంక్షిప్త సమాచారం :
శ్రీ సుందరరాజస్వామివారి అవతారోత్సవాల పురాణ నేపథ్యాన్ని పరిశీలిస్తే చాలా సంవత్సరాల క్రితం ముష్కరులు మధురైలో ఉన్న అళగిరి పెరుమాళ్ కోయిల్ను కూల్చేందుకు ప్రయత్నించారట. ఆ సమయంలో అక్కడున్న అర్చకస్వాములు శ్రీ సుందరరాజస్వామివారి ఉత్సవమూర్తులను తిరుచానూరుకు తీసుకొచ్చారని ప్రచారంలో ఉంది. దానికి తగ్గట్టుగానే స్వామివారి విగ్రహాలు(ఉత్సవర్లు) పురాతనంగా కనిపిస్తున్నాయి. మహంతుల కాలంలో అనగా 1902వ సంవత్సరంలో మూలమూర్తులను తయారుచేసి ప్రతిష్ఠించారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఆ తరువాత సుందరరాజస్వామివారికి అనేక ఉత్సవాలు జరిగాయి. స్వామివారిని తిరుచానూరుకు తీసుకొచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తూ అవతారోత్సవాలు నిర్వహిస్తారు.