Wed. May 22nd, 2024

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి14,హైదరాబాద్: తెలుగు ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగలలో సంక్రాంతి పండుగ ఒకటి. ఈ పండుగ మూడు రోజులు ఉంటుంది. తొలి రోజు భోగితో ప్రారంభమవుతుంది. భోగి పండుగ అనే పదానికి ‘తొలినాడు’ అనే పేరు ఉంది. అనగా పండుగకు తొలినాడు అని అర్ధం. భోగి రోజున ఇంటి ముందర మంట వేస్తే ఇంటిలో ఉండే దారిద్ర్య దేవతను తరిమినట్లేనని శాస్త్రాలు చెబుతున్నాయి.

భోగి పళ్లు ఎందుకు పోస్తారు?

భోగి అనగానే గుర్తుకు వచ్చేది భోగి పళ్ళు. ఈ పళ్ళను పోయడంలో అంతరార్ధం ఏమిటి? భోగి నాడు భోగి పళ్ళు అనే పేరుతో రేగి పండ్లను పిల్లల మీద పోస్తారు. రేగి చెట్టు, రేగి పండ్లు శ్రీ మన్నారాయణ స్వామి ప్రతిరూపం. వాటిని తల మీద పోయడం వలన శ్రీ లక్ష్మీనారాయణుల అనుగ్రహం మన పిల్లలపై ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. భోగి పండ్లు పోయడం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి, దిష్టి తొలుగుతుందంటారు. మనకు కనిపించదు కానీ తల పై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుందటా. ఈ భోగి పండ్లను పోస్తే పిల్లలు జ్ఞానవంతులవుతారట.

దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దూరం అవటం వల్ల భూమిపై చలి పెరుగుతుంది. ఉత్తరాయణం ప్రారంభమయ్యే ముందు రోజు ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ చలిని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగ భగ మండే చలి మంటలు వేసుకునేవారు. ఈ మంటలు వేయడం వలన భోగీ అనే పేరు వచ్చింది. సాధారణంగా అందరు చెప్పేది… ఇది చలి కాలం కనుక వెచ్చదనం కోసం మంటలు వేస్తారని. కానీ నిజానికి భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు… ఆరోగ్యం కోసం కూడా. ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో వాడుతారు. దేశి ఆవు పేడ పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది ఆ గాలి పీల్చడం ఆరోగ్యానికి మంచిది. సూక్ష్మక్రిములు నశిస్తాయి.
భోగి మంటల్లో పనికిరాని వస్తువులను కాల్చండి అని వింటుంటాం. పనికిరాని వస్తువులు అంటే ఇంట్లో ఉండే ప్లాస్టిక్ కవర్లు, వైర్లు లాంటివి కావు. ఇక్కడ మనం చరిత్రకి సంబంధించిన ఒక విషయం గుర్తుకు తెచ్చుకోవాలి. నిజానికి భోగి మంటల్లో కాల్చాల్సింది పాత వస్తువులని కాదు… మనలోని పనికి రాని అలవాట్లు, చెడు లక్షణాలు. అప్పుడే మనకున్న పీడ పోయి మానసిక ఆరోగ్యం, విజయాలు వస్తాయి.

‘భగ’ అనే పదం నుంచి భోగి అనే మాట వచ్చింది. ‘భగ’ అంటే వేడి లేదా మంట పుట్టించటం అన్నమాట. దక్షిణాయనానికి ఆఖరి రోజు భోగి.

దక్షిణాయనంలో తాము ఎదుర్కొన్న కష్టాలు, బాధలను భోగిమంటల రూపంలో అగ్ని దేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ప్రసాదించమంటూ ప్రజలు ప్రార్థిస్తారు. భోగి పండుగ మనలోని ఆశావహ దృక్పథానికి సంకేతం.

భోగి మంటలతో మొదలు

భోగి రోజున తెల్లవారక ముందే లేచి భోగి మంటలు వేస్తారు. ఆవు పేడ పిడకలు, మామిడి, రావి, మేడి వంటి చెట్ల అవశేషాలు, తాటాకులు, అప్పటికే కోసిన పంటల ఎండు అవశేషాలు వేసి రాజేసే ఈ మంటల్లో ఇంట్లోని పాత వస్తువులను ఈ మంటల్లోకి విసిరేస్తారు. ఎవరు ఎక్కువ వస్తువులు తెచ్చి మంటల్లో వేస్తే వారు గొప్పగా పరిగణిస్తారు. తెల్లవారు జామున వణికించే ఆ చలిలో చిన్నా పెద్దా అంతా చేరి చలిమంటలు కాచుకుంటారు. పనికి రాని చెడు పాత ఆలోచనలను వదిలించుకొని కాలంతో బాటు వచ్చే మార్పులను ఆహ్వానించేందుకు మనసును సిద్ధం చేయటమే భోగి మంట వెనకున్న పరమార్థం. అయితే ప్రస్తుత కాలంలో పాత సామానుకు బదులు పాత టైర్లు, కిరోసిన్, ప్లాస్టిక్ వస్తువులు సైతం వేస్తున్నారు. ఈ చర్య పర్యావరణానికి చేటు చేయటమే గాక ఈ మంటలో వచ్చే ప్రమాదకర వాయువులు ఆరోగ్యానికి కీడు చేస్తాయని గుర్తించాలి.

నలుగు స్నానం తప్పనిసరి.
భోగిమంటలు పూర్తి కాగానే తలకి, ఒంటికి నువ్వుల నునె పట్టించి మర్దన చేసుకొని కుంకుడు కాయ రసంతో తలస్నానం చేయాలి. ఇది ప్రతి ఒక్కరూ తప్పని సరిగా చేయాలి. దీనివల్ల చలి వాతావరణం కారణంగా ఒంట్లో చేరిన కఫ దోషాలు తొలగి పోయి శరీరం నూతన ఉత్తేజాన్ని పొందుతుంది. ఇలా చేసే స్నానం పీడను, దరిద్రాన్ని తొలగిస్తుందని పెద్దల నమ్మకం.

పులగం….
భోగినాడు కొత్త బియ్యతో చేసిన పులగం తినటం సంప్రదాయం. కొత్త బియ్యం, పెసర పప్పు, నెయ్యి, మిరియాలు జోడించి చేసే ఈ వంటకం రుచికే గాక పోషకాల పరంగానూ ఎంతో మేలైనది. చలికాలంలో జీర్ణశక్తిని ప్రేరేపించే ఈ పులగాన్ని భోగినాడు తప్పక తినాలని పెద్దలు చెబుతారు.

బొమ్మల కొలువు…
భోగినాటి సాయంత్రం చిన్న పిల్లలు బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు. బొమ్మల కొలువు లో పిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల ఆటవస్తువులను క్రమపద్ధతిలో ప్రదర్శనగా ఉంచి పూజిస్తారు. ఈ సందర్భంగా ఆయా దేవీ దేవతల పాటలు పాడి వారి ఆశీస్సులు కోరుకుంటారు.

భోగి పులక…
కొన్ని ప్రాంతాలలో భోగి రోజున రైతులు తమ సాగుభూమికి ఆనవాయితీగా కొంతమేర నీరు పారించి తడి చేస్తారు, ఒక పంట పూర్తయిన తదుపరి మళ్ళీ పంట కొరకు సాగుభూమిలో నీరు పారించడాన్ని పులకేయడం అంటారు, ఆనవాయితీగా భోగి రోజున పులకేయడాన్ని భోగి పులక అంటారు.