365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, ఏప్రిల్ 21, 2025: వేములవాడ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదంపై గత 15 ఏళ్లుగా సాగించిన న్యాయపోరాటంలో చారిత్రాత్మక విజయం సాధించారు. తెలంగాణ హైకోర్టు మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్కు రూ.30 లక్షల జరిమానా విధిస్తూ గత డిసెంబర్ 9, 2024న సంచలన తీర్పు వెలువరించింది. ఈ తీర్పు మేరకు, సోమవారం హైకోర్టు న్యాయవాదులు వి. రోహిత్ రావు సమక్షంలో చెన్నమనేని రమేష్ ఆది శ్రీనివాస్కు రూ.25 లక్షలు, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీకి రూ.5 లక్షలు చెల్లించారు.
చెన్నమనేని రమేష్ భారత పౌరుడు కాదని, జర్మన్ పౌరసత్వం కలిగి ఉన్నారని హైకోర్టు తీర్పులో స్పష్టం చేసింది. తప్పుడు ధ్రువపత్రాలతో అధికారులను, న్యాయస్థానాలను 15 ఏళ్లపాటు మోసం చేశారని కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 2019లో కేంద్ర హోంశాఖ చెన్నమనేని భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేయగా, దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. ఐదేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ఈ తీర్పు వెలువరించారు. రూ.30 లక్షల జరిమానా విధించిన కేసు చరిత్రలో అరుదైనదని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇది కూడా చదవండి...ఢిల్లీకి గ్రీన్ ట్రాన్సిట్ బూస్ట్: ఏప్రిల్ 22న కొత్త 320 AC ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభం
ఇది కూడా చదవండి…ఎయిర్టెల్ స్పామ్ డిటెక్షన్ను అప్గ్రేడ్ చేసింది – 15 భారతీయ భాషల్లో హెచ్చరికలు
ఆది శ్రీనివాస్ తరఫున హైకోర్టులో సీనియర్ కౌన్సిల్ వి. రవికిరణ్ రావు, వి. రోహిత్ రావు వాదనలు వినిపించారు. “తప్పుడు పత్రాలతో చెన్నమనేని నియోజకవర్గ ప్రజలను, న్యాయవ్యవస్థను మోసం చేశారు. నా 15 ఏళ్ల న్యాయపోరాటం న్యాయానికి గౌరవం తెచ్చింది,” అని ఆది శ్రీనివాస్ తెలిపారు. 2009లో చెన్నమనేని వేములవాడ ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచినప్పటి నుంచి, ఆయన పౌరసత్వంపై ఆది శ్రీనివాస్ పోరాటం సాగించారు. ఈ మోసం కారణంగా తాను నాలుగు సార్లు ఎమ్మెల్యే అవకాశాన్ని కోల్పోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

చెన్నమనేని రమేష్ కోర్టు తీర్పును అప్పీల్ చేయకుండా తప్పును ఒప్పుకుని జరిమానా చెల్లించారు. ఆది శ్రీనివాస్ ఈ సందర్భంగా, “చెన్నమనేని వేములవాడ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. 2009 నుంచి 2023 వరకు ఆయన ఎమ్మెల్యే కాదని గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలి. ఆయనకు ప్రభుత్వ లబ్ధులు అందకుండా చూడాలి,” అని డిమాండ్ చేశారు. ఇప్పటికే చెన్నమనేనిపై క్రిమినల్ కేసుల నమోదుకు డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.
ఈ కేసులో తమకు సహకరించిన న్యాయవాదులు వి. రవికిరణ్ రావు, వి. రోహిత్ రావులకు ఆది శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. “ఈ తీర్పు న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచుతుంది,” అని ఆయన అన్నారు.
Read this also…Airtel Expands AI-Powered Anti-SPAM Features with Regional Language Alerts and International Call Filtering
ఇది కూడా చదవండి...7000 mAh పెద్ద బ్యాటరీ’సూపర్ బ్రైట్’ డిస్ప్లేతో Oppo K13 5G లాంచ్..
ఈ తీర్పు న్యాయవ్యవస్థ బలాన్ని, సత్యం చివరికి విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని బలపరుస్తుంది. చెన్నమనేని రమేష్ విషయంలో తప్పుడు ధ్రువపత్రాలతో రాజకీయ లబ్ధి పొందేందుకు చేసిన ప్రయత్నాలు బహిర్గతమవడం, భవిష్యత్తులో ఇలాంటి మోసాలను నిరోధించేందుకు హెచ్చరికగా నిలుస్తుంది. ఆది శ్రీనివాస్ నిర్విరామ పోరాటం న్యాయం కోసం పట్టుదలతో సాగే ప్రయాణానికి ప్రేరణ.