Fri. Sep 20th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అక్టోబర్ 18,2023:దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఈ రెండు వారాల్లోనే అత్యధిక పతనాన్ని చవిచూశాయి. ఇజ్రాయెల్‌, పాలస్తీనా యుద్ధంతో భౌగోళిక రాజకీయాలు మరింత జటి అవుతున్నాయి.

యుద్ధంలో ఇరాన్‌ జోక్యం చేసుకొనేందుకు ప్రయత్నిస్తుండటంతో ముడిచమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పైగా ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలే అందాయి.

ఒడుదొడుకుల నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణ, పెట్టుబడులు వెనక్కి తీసుకొనేందుకు మొగ్గు చూపుతున్నారు. ఆసియాలో జపాన్‌, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా మినహా మేజర్‌ సూచీలు పతనమయ్యాయి.

నేడు విదేశీ సంస్థాగత మదుపర్లు రూ.1831 కోట్ల స్టాక్స్‌ను అమ్మేశారు. స్థానిక ఇన్వె్స్టర్లు రూ.1469 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.

క్రితం సెషన్లో 66,428 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 66,473 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 66,475 వద్ద గరిష్ఠానికి చేరుకుంది. ఉదయం 10:30 గంటల నుంచి ఒక్కసారిగా పతనమైంది.

మధ్యాహ్నం 2 గంటలకు కోలుకొనే ప్రయత్నం చేసినా సరైన మద్దతు దొరకలేదు. దాంతో 65,842 వద్ద ఇంట్రాడేలో కనిష్ఠాన్ని తాకింది. ఆఖరికి 551 పాయింట్ల నష్టంతో 65,8778 వద్ద ముగిసింది.

బుధవారం ఉదయం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 19,820 వద్ద మొదలైంది. 19,840 వద్ద గరిష్ఠాన్ని తాకింది. 19,659 వద్ద కనిష్ఠాన్ని చేరుకొని మొత్తంగా 140 పాయింట్ల పతనంతో 19,671 వద్ద క్లోజైంది. ఇక బ్యాంకు నిఫ్టీ 520 పాయింట్లు తగ్గి 43,888 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ 50లో 11 లాభాల్లో 39 నష్టాల్లో ముగిశాయి. సిప్లా (3.50%) , డాక్టర్‌ రెడ్డీస్‌ (2.18%), టాటా మోటార్స్‌ (1.76%), సన్ ఫార్మా (1.44%), ఎస్బీఐ లైఫ్‌ (0.49%) టాప్‌ గెయినర్స్‌.

బజాజ్‌ ఫైనాన్స్‌ (2.95%), బజాజ్ ఫిన్‌సర్వ్‌ (1.85%), ఎన్టీపీసీ (1.46%), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు (1.44%), రిలయన్స్‌ (1.44%) అత్యధికంగా నష్టపోయాయి.

రంగాల వారీగా చూస్తే బ్యాంకు, ఫైనాన్స్‌, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంకు, ప్రైవేటు బ్యాంకు, రియాల్టీ, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు ఎక్కువ పతనమయ్యాయి. మీడియా, ఫార్మా, హెల్త్‌కేర్‌ మాత్రం ఎగిశాయి.

నిఫ్టీ అక్టోబర్‌ నెల ఫ్యూచర్స్‌ ఛార్ట్‌ను గమనిస్తే 19,760 వద్ద రెసిస్టెన్సీ, 19,650 వద్ద సపోర్టు ఉన్నాయి. ఇన్వెస్టర్లు స్వల్ప కాలంలో రిలాక్సో ఫుట్‌వేర్‌, టాటా ఎలెక్సీ, సిప్లా, టాటా మోటార్స్‌, ఎస్బీఐ లైఫ్‌ షేర్లను కొనుగోలు చేయొచ్చు. నిఫ్టీ పతనంలో హెచ్‌డీఎఫ్సీ బ్యాంకు, రిలయన్స్‌, ఐసీఐసీఐ బ్యాంకు, బజాజ్‌ ఫైనాన్స్‌ ఎక్కువ కాంట్రిబ్యూట్‌ చేశాయి.

ఫినోలెక్స్‌ కేబుల్స్‌ కేసులో నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యూనల్‌ సభ్యులపై సుప్రీం కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. బీవోబీ వరల్డ్‌ కేసులో బ్యాంక్ ఆఫ్ బరోడా కొందరు ఉద్యోగులను తొలగించడం సంచలనంగా మారింది.

మంచి ఫలితాలే విడుదల చేసినా పాలీక్యాబ్‌ షేర్లు పతనమయ్యాయి. ఒడిశా బొగ్గు గనులకు బిడ్‌ వేయాలన్న జిందాల్‌ స్టీల్‌ అభ్యర్థనను సుప్రీం కోర్టు డిస్మిస్‌ చేసింది.

హెరిటేజ్ ఫుడ్స్‌ క్యూ2 ఎర్నింగ్స్‌ ఫలితాలు ప్రకటించింది. వార్షిక ప్రాతిపదికన నికర లాభం 18 శాతం పెరిగి రూ.22.4 కోట్లుగా నమోదైంది. ఆదాయం 20 శాతం ఎగిసి రూ.979 కోట్లకు చేరింది.

  • మూర్తి నాయుడు పాదం
    నిఫ్ట్ మాస్టర్
    స్టాక్ మార్కెట్ అనలిస్ట్
    +91 988 555 9709
error: Content is protected !!